అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. తదుపరి, కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ దేవాలయం. కృష్ణ జన్మభూమి శిథిలాల మీద షాహీ ఈద్గా మసీదు నిర్మించబడిందని మరియు కాశీ విశ్వనాథ ఆలయ శిథిలాలపై జ్ఞానవాపి మసీదు నిర్మించబడిందని హిందుత్వ జాతీయవాదులు వాదిస్తారు. ఈ ప్రదేశాల చుట్టూ ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నాయి. హిందుత్వ భావజాలం & అయోధ్య వంటి పురావస్తు ప్రదేశాల చుట్టూ ఉన్న రాజకీయాలు వినాశకరమైన ముస్సోలినీ ఫాసిజం & హిట్లర్ నాజీయిజం నుండి కాపీ చేయబడ్డాయి. ఐరోపా నియంతృత్వ జాతీయవాదులు తమ పౌరులను మోసపూరిత పురావస్తు తవ్వకాలు, ఫోర్జరీలు, వక్రీకరణ, తప్పుడు సమాచారం, ద్వేషం & హింసతో మోసం చేశారు. వారి చర్యల ఫలితంగా మిలియన్ల మంది ప్రజలు మరణించారు మరియు ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. అలాగే హిందుత్వ వాదులు ఇప్పుడు హిందువులని మోసం చేస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు.
ఈ పోస్ట్ కేవలం రాజకీయాలకు సంబంధించినది కాదు. పక్షపాత ఆలోచనలు మరియు జాతీయ అహంకారం ఉన్నఐరోపా పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు వంటి పండితులు, విద్యావేత్తలు మరియు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుడు సమాచారాన్నిపంచడం, చరిత్రను వక్రీకరించడం, ఫాసిస్ట్ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఎలా పని చేశారో, మరియు ఫాసిస్ట్ జాతీయవాదం యొక్క వినాశకరమైన పరిణామాల గురించి నేను చర్చించాను.
ఫాసిస్ట్ జాతీయవాదం ఫలితంగా నిరంకుశత్వ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలను బలవంతంగా అణిచివేయడాలు, ప్రజల మధ్య విభేదాలు, ద్వేషం, హింస, వాక్ స్వాతంత్య్రం కోల్పవడం, భిన్నాభిప్రాయాలను అణచివేయడం మరియు నకిలీ విజ్ఞానం (pseudoscience) మరియు మూఢనమ్మకాలను ప్రోత్సహించడం జరిగింది. ఐరోపాలో వినాశకరమైన ఇటాలియన్ ఫాసిజం మరియు నాజీయిజం ఒకటి లేదా రెండు సంవత్సరాలలో అభివృద్ధి చెందలేదు. ఇది కొన్ని దశాబ్దాల కాలంలో పరిణామం చెంది రెండవ ప్రపంచ యుద్ధం నాటికి తీవ్ర రూపం దాల్చింది. అదే తరహాలో హిందుత్వ నకిలీ జాతీయ వాదం ఇప్పుడు బలంగా అభివృద్ధి చెందుతోంది.
‘ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక’ (2011) అనే తన పుస్తకంలో, ఇటలీలోని టురిన్ విశ్వవిద్యాలయంలో ఆసియా చరిత్రకు సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్ మరియు రచయిత మరియు అయిన మార్జియా కాసోలారి ఇలా అన్నారు. 1
‘‘బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మరియు సంఘ్ పరివార్ భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా బలంగా ఉన్నప్పుడు, “హిందుత్వ అనేది ఫాసిజం యొక్క భారతీయ వెర్షన్” అని చెప్పిన నెహ్రూ యొక్క హిందూ జాతీయవాద (హిందుత్వ) నిర్వచనాన్ని ఈరోజు నిర్ధారించవచ్చు. కానీ మనం మరింత ముందుకు వెళ్లి నేటి సంఘ్ పరివార్ ని నాజీయిజం (Nazism) యొక్క భారతీయ రూపంగా నిర్వచించవచ్చు. భారతీయ ముస్లింలపై బిజెపి ప్రభుత్వం మరియు హిందూత్వ శక్తులు విధించిన భారీ వివక్షలు, వేధింపులు, హింస మరియు విభజనలు ఫాసిస్ట్ మరియు నాజీ నియంతలు మరియు వారి అనుచరులు అనుసరించిన సిద్ధాంతాలు, పద్ధతులు మరియు అభ్యాసాలను గుర్తుకు తెస్తున్నాయి.”
‘ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక’ (2011) అనే తన పుస్తకంలో, రచయిత మార్జియా కాసోలారి Tweet
పైన పేర్కొన్న పుస్తకం యొక్క కొత్త వెర్షన్ 2020లో విడుదల చేయబడింది.
రాజకీయ జాతీయవాదం యొక్క మూలాలు:

చిత్రం: 1937లో మ్యూనిచ్లో ఇటాలియన్ నియంత ముస్సోలినీ (ఎడమ) మరియు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ (కుడి).
Image by Tullio Saba.
రాజకీయ జాతీయవాదం పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో, ఫ్రెంచ్ విప్లవం (1789-1799) సమయంలో కనిపించింది. ఉమ్మడి భూభాగం, జాతి, మతం, భాష లేదా సంస్కృతిని పంచుకున్న ఏదైనా సజాతీయ సంఘాన్ని (homogeneous community) ఒక దేశ జాతిగా (nation) నిర్వచించడానికి మరియు రాజకీయ స్వయం-ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రమాణంగా మారింది. జాతి మరియు భాష కీలక ప్రమాణాలు గా మారాయి. 2
కానీ, ఒక దేశం యొక్క ఉనికిని రుజువు చేయడానికి దాని గతం గురించి వివరించాల్సిన అవసరం ఉంది. గతాన్ని వివరించడానికి చారిత్రక పత్రాలు, సాహిత్యం మరియు పురావస్తు శాస్త్రం ఉపయోగించబడ్డాయి. 18వ శతాబ్దం చివరిలో మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో మాత్రమే కళాత్మక మరియు సాహిత్య సాధన గా ఉన్న చరిత్ర (చరిత్ర అనే సబ్జెక్టు) శాస్త్రీయ క్రమశిక్షణగా (scientific discipline) రూపాంతరం చెందింది. పురావస్తు శాస్త్రం 19వ శతాబ్దంలో మాత్రమే శాస్త్రీయ క్రమశిక్షణ గా మారింది మరియు జాతీయవాదాన్ని నిర్మించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది.
అసురక్షిత లేదా ఇతరుల నుండి తరుచూ భౌతిక దాడులను ఎదుర్కొన్న సంఘాలు ఎక్కువ జాతీయ భావాలను కలిగి ఉంటాయి. కొన్ని సంఘాలు దేశాలుగా ఏర్పడటానికి జాతీయవాదాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ తమ సొంత పౌరులపై అణచివేత, ప్రాదేశిక దండయాత్ర మరియు జాతి నిర్మూలనను సమర్థించడానికి పురావస్తు శాస్త్రం మరియు ఇతర రంగాలను తీవ్రంగా ఉపయోగించడంలో జర్మన్ మరియు ఇటాలియన్ ఫాసిస్ట్ జాతీయవాదాలు రెండు ఉదాహరణలు.
ఫ్రెంచ్ విప్లవం (1799) తర్వాత ఫ్రాన్స్ జాతీయ-రాజ్యంగా (nation-state) మారింది (బహుశా మొదటిది). అయితే కొంతమంది పండితులు (scholars) 1649 లో ఇంగ్లీష్ కామన్వెల్త్ స్థాపనను జాతీయ-రాజ్య సృష్టికి తొలి ఉదాహరణగా భావిస్తారు. 1861 లో ఇటలీ జాతీయ-రాజ్యంగా మారింది మరియు 1871 లో జర్మనీ జాతీయ-రాజ్యంగా (జర్మన్ రీచ్) అవతరించింది.
ఐరోపాలో 20వ శతాబ్దం ప్రారంభంలో ఫాసిజం ప్రజాదరణ పొందింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీలో మొదటి ఫాసిస్ట్ ఉద్యమాలు ఉద్భవించాయి మరియు ఇతర ఐరోపా దేశాలకు, ముఖ్యంగా జర్మనీకి వ్యాపించాయి.
ఇటాలియన్ ఫాసిజం మరియు పురావస్తు శాస్త్రం
ఇటాలియన్ ఫాసిజం అనేది దాని నియంత బెనిటో ముస్సోలిని (1922-45) ఆధ్వర్యంలోని సాంస్కృతిక జాతీయ వాదం. కింది నాలుగు లక్షణాలలో మొదటి మూడు ఇటలీ దేశాన్ని నిర్వచించడానికి ప్రమాణంగా పరిగణించబడ్డాయి.
1. ఇటలీ గతాన్ని రోమ్ మరియు ఇతర నగరాల రోమన్ సామ్రాజ్యం (Roman Empire) (27 BC-AD 330) తో గుర్తించడం. వారు దీనిని తరచుగా మోసపూరిత పురావస్తు త్రవ్వకాల తో మరియు చారిత్రక రికార్డులు లేదా సాహిత్యం వంటి మూలాలకు అనుగుణంగా శాసనాల ఫోర్జరీలు చేయడం ద్వారా సాధించారు. కొన్నిసార్లు, నకిలీ మూలాలు సృష్టించబడ్డాయి.
హిందుత్వ వాదులు భారత దేశ గతాన్ని కేవలం వైదిక సంస్కృతిగా మరియు వైదిక ఆర్యులను హరప్పా నాగరికత ప్రజలుగా తప్పుడు ప్రచారం చేస్తారు.
2. ఇటలీ వలసవాద కాలనీలను సృష్టించడానికి ప్రాదేశిక దండయాత్రలు (territorial invasions). వారు దండయాత్రలను సమర్థించడానికి పురావస్తు (మోసపూరిత) అన్వేషణలను ఉపయోగించారు.
3. సంస్కృతి ఆధిక్యత. ఉత్తర ఇటలీ సంస్కృతి పూర్వ చరిత్ర (prehistoric) కాలంలో నాగరికతగా పరిగణించబడింది మరియు దక్షిణ ఇటలీని ఉత్తర ఇటలీ నాగరీకరించినట్టు పరిగణించబడింది. ఉత్తర ఇటలీలోని ఫాసిస్టులు రెండు ప్రాంతాల ఏకీకరణను కోరుకున్నారు. ఫాసిస్టుల ఆలోచనలను ప్రశ్నించే మైనారిటీల, ప్రజల సంస్కృతులు ధ్వంసమయ్యాయి.
4. ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించిన పౌరులు హింసించబడ్డారు మరియు చంపబడ్డారు.
మొదట జర్నలిస్ట్ అయిన ముస్సోలినీ, ఫాసిస్ట్ ఆలోచనలను సమర్థవంతంగా ప్రచారం చేయడానికి ప్రతి మీడియాను ఉపయోగించడంలో సమర్ధుడు. నిర్బంధ శిబిరాలు, వలసవాద యుద్ధాలు, రెండవ ప్రపంచ యుద్ధం, మరియు ఈ యుద్ధాల వల్ల ఏర్పడిన కరువులలో వేలాది మంది ఇటాలియన్ పౌరులు మరణించారు మరియు లక్షల మంది ప్రజలు మరణించారు. ముస్సోలినీ యొక్క ఫాసిస్ట్ పాలన వల్ల సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 15 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది.
నాజీయిజం మరియు పురావస్తు శాస్త్రం
పక్షపాత అభిప్రాయాలు మరియు జర్మనీ జాతీయ అహంకారం ఉన్న మానవ శాస్త్రవేత్తలు (anthropologists), పురావస్తు శాస్త్రవేత్తలు, మానవ జాతి శాస్త్రవేత్తలు (ethnologists), పూర్వ చరిత్రకారులు మరియు ఇతర మేధావులు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ (1889-1945) తో సహా జర్మనీ ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేశారు మరియు జర్మనీ జాతీయవాదాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు.
హిట్లర్ యొక్క నాజీయిజం ఒక జాతి ఆధిపత్య జాతీయవాదం. కింది నాలుగు లక్షణాలలో మొదటి మూడు జర్మనీ దేశాన్ని నిర్వచించడానికి ప్రమాణంగా పరిగణించబడ్డాయి.
1. ఉత్తర-మధ్య ఐరోపా లో పురాతన రోమన్ సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న జర్మేనియా తో (Germania) ప్రాంతాన్ని జర్మనీ గతంగా గుర్తించడం. జెర్మానిక్ చెరుస్కీ తెగ అధిపతి అర్మినియస్ (Arminius) (17 BC–21 AD) చేసిన పోరాటం ద్వారా రోమన్ ఆక్రమణ నుండి జెర్మేనియా రక్షించబడింది.అర్మినియస్ జాతీయ సమైక్యత ఆలోచనకు ప్రతీకగా నిలిచాడు.
ఎడ్డా (Edda) మరియు నిబెలుంగెన్లీడ్ (Nibelungenlied) వంటి పురాతన పురాణాలు మరియు ప్రాచీన రోమన్ చరిత్రకారుడి టాసిటస్ (Tacitus) యొక్క సాహిత్యం జర్మనీ పూర్వ చరిత్రకు అధికారిక మూలాలుగా ఉపయోగించబడ్డాయి.
హిందుత్వ రాజకీయాలు ఎటువంటి బలమైన అధరాలు లేని రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాల చుట్టూ తిరుగుతాయి.
2. జాత్యహంకారం మరియు యాంటీ/యాంటై సెమిటిజం (Antisemitism: యూదుల పట్ల శత్రుత్వం, పక్షపాతం లేదా వివక్ష). ఆర్యులు అత్యున్నత స్థానంలో ఉన్న, యూదులు అత్యల్ప స్థానంలో ఉన్న నకిలీ శాస్త్రీయ (pseudoscientific) జాతి సోపానక్రమాన్ని (racial hierarchy) హిట్లర్ విశ్వసించాడు. అతను ఆర్యులు స్వచ్ఛమైన జాతి మరియు ‘సంస్కృతి స్థాపకులు’ అని మరియు యూదులు ‘సంస్కృతిని నాశనం చేసేవారు’ అని నమ్మాడు.
హిట్లర్ యూదులను బలిపశువులను చేసాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడానికి, జర్మనీ యొక్క ఆర్థిక క్షీణతకు మరియు కమ్యూనిజానికి యూదులే కారణమని, మరియు వారు ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు అని అతను విశ్వసించాడు. అతను యూదులను సూక్ష్మక్రిములతో పోల్చాడు మరియు వారిని నిర్మూలించాల్సిన (చంపివేయాల్సిన) అవసరం ఉందని చెప్పాడు. అతని పక్షపాత నమ్మకాలు ఏవీ నిజం కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు లక్ష మంది జర్మనీ మరియు ఆస్ట్రియా యూదులు తమ దేశాల కోసం పోరాడారు.
హిందుత్వ వాదంలో ముస్లిములు బలిపశువులు అవుతున్నారు.
జర్మనీకి ఉత్తర, పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాలకు ప్రాదేశిక విస్తరణను (territorial expansion) సమర్థించడం సులభం, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో జర్మనీ భాషలు మాట్లాడేవారు. స్లావిక్ భాషలు (Slavic languages) మాట్లాడే తూర్పు జర్మనీలో విస్తరణను సమర్థించేందుకు, నాజీలు పురాతన జర్మనీ ప్రజల చరిత్రను సరైన ఆధారాలు లేకుండా 9,000 B.C. కు పొడిగించారు. హిందుత్వ వాదులు కూడా ఇలాగే సరైన అధరాలు లేకుండా ఆర్యులు హరప్పా నాగరికత కన్నా ముందు నుంచే భారత ఉపఖండంలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.
నాజీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన పౌరులు హింసించబడ్డారు మరియు చంపబడ్డారు.
పైన పేర్కొన్న మొదటి మూడు సందర్భాల్లో, నాజీ నాయకులు తమ జాతీయవాద ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి మోసపూరిత పురావస్తు మరియు ఇతర అన్వేషణలను ఉపయోగించారు. ఉదాహరణకు, హిట్లర్ మరియు నాజీ పార్టీ అనుసరించిన జాతి సిద్ధాంతాలను ప్రోత్సహించడానికి ది అహ్నెనర్బే (Ahnenerbe) అనే నకిలీ-శాస్త్రీయ సంస్థ స్థాపించబడింది. ఇది విస్తృత శ్రేణి విద్యా విభాగాల నుండి పండితులు మరియు శాస్త్రవేత్తలతో కూడి ఉంది. వారు జర్మన్లు ఇతర జాతుల కంటే జాతిపరంగా ఉన్నతమైన ఆర్య జాతి వారసులు అన్న ఆలోచనను ప్రోత్సహించారు.
హిందుత్వ ఫాసిజం

హిందూత్వ అనేది సాంస్కృతిక మరియు జాత్యహంకార జాతీయవాదం. హిందుత్వ సిద్ధాంతకర్తల అభిప్రాయాలు చారిత్రాత్మకంగా మరియు శాస్త్రీయంగా సరైనవి కావు. నేను నా మునుపటి బ్లాగ్ పోస్ట్లో దీని గురించి చర్చించాను.
హిందూత్వ జాతీయ వాదం బలమైన మరియు బలహీనమైన లక్షణాలను కలిగి ఉంది. క్రింది పేర్కొన్నవి దాని బలమైన లక్షణాలు:
1. హిందూత్వ అనేది హిందూ ఆధిపత్య భావజాలం. హిందువులు మాత్రమే పౌరులుగా పరిగణించబడే, మరియు హిందువులు కానీ వారు, ముఖ్యంగా ముస్లింలు హిందువులకు లోబడి ఉండే హిందూ రాష్ట్రాన్ని (దేశాన్ని) నెలకొల్పడమే హిందుత్వ వాదుల లక్ష్యం. వారు హిందువులు, సిక్కులు, బౌద్ధులు మరియు జైనులను హిందువులుగా పరిగణిస్తారు.
2. ముస్లింలపై తీవ్ర వివక్ష, వేధింపులు మరియు హింస. ముస్లింలు ప్రధాన బాధితులు, కానీ క్రైస్తవులు కూడా బాధితులు. ముస్లింలు మరియు క్రైస్తవులపై ద్వేషపూరిత ప్రచారం మరియు హింస యొక్క ముఖ్య ఉద్దేశ్యం హిందూ ఓటర్లను ఏకం చేయడం.
3. సాంస్కృతిక ఆధిక్యత మరియు ఇతర సంస్కృతులని అనైతికంగా కలిపేసుకోవడం: క్రీ.పూ 2,000 తర్వాత భారత ఉపఖండానికి వలస వచ్చిన ఇండో-ఆర్యులు అభివృద్ధి చేసిన వైదిక సంస్కృతిని, దానికన్నా ముందే, దానికన్నా ఎక్కువ అభివ్రిద్ది చెందిన హరప్పా లేదా సింధూ నాగరికత (క్రీ.పూ 3,300–క్రీ.పూ 1,300) కన్నా గొప్పదని ప్రచారం చేయడం.
హిందూత్వ జాతీయవాదులు వైదిక సంస్కృతిని ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన సంస్కృతిగా ప్రచారం చేస్తారు. ఈ అభిప్రాయం తరచుగా భారతదేశాన్ని (వైదిక భారతదేశం) విశ్వ గురువు గా ప్రచారం చేయడం ద్వారా వ్యక్తీకరిస్తారు. వైదిక ఆర్యులు చాలా కాలం క్రితమే అనేక శాస్త్రీయ (అవాస్తవం) ఆవిష్కరణలు చేశారని, వాటిని పాశ్చాత్యులు కాపీ చేశారని వారు తరచుగా ప్రచారం చేస్తారు.
వారు ఇండో-ఆర్యులు వాడిన సంస్కృత భాష నుండి వచ్చిన హిందీ భాషను హిందీ మాట్లాడని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. వారు తమ ఆహారపు అలవాట్లను కూడా ఇతరులపై రుద్దుతారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు వడ్డించడాన్ని నిషేధించడం ఒక ఉదాహరణ.
‘అఖండ భారత్’ (Akhand Bharat లేదా అవిచ్ఛిన్న భారతదేశం) వంటి హిందూత్వ బలహీన (ప్రస్తుతానికి) లక్షణాలు ఉన్నాయి. ‘అఖండ భారత్’ యొక్క హిందూత్వ నిర్వచనం భారతదేశాన్ని “భారతవర్ష్” గా పేర్కొన్న హిందూ ఇతిహాసం మహాభారతంపై ఆధారపడింది. ‘అఖండ భారత్’ అనేక దక్షిణాసియా దేశాల భూభాగాలను కలిగి ఉంటుంది. ఇది హిందూ మెజారిటీ సామ్రాజ్యవాద (imperialism) ఆలోచన.
భారతదేశ విభజన తర్వాత హిందూత్వ నాయకులు ఈ ఆలోచనను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు హిందుత్వ నాయకులు తరచూ దీని గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి ట్విట్టర్లో ‘అఖండ భారత్’ మ్యాప్ను షేర్ చేయడంతో పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లు దుమారం రేపాయి.
హిందుత్వ జాతీయవాదులు ఇటాలియన్ ఫాసిజం మరియు నాజీయిజం నుండి ప్రేరణ పొందారు
RSS మరియు ఇటలీ ఫాసిస్ట్ సాంస్కృతిక సంస్థలు

చిత్రం: ఇటాలియన్ బల్లిలా ఫాసిస్ట్ సంస్థలో మిలిటెంట్లుగా శిక్షణ పొందుతున్న ఇటాలియన్ పిల్లలు
RSS యొక్క పారామిలిటరీ నిర్మాణం ఇటలీ ఫాసిస్ట్ యువజన సంస్థలచే ప్రేరణ పొందింది.
బి.ఎస్. మూంజే (B.S. Moonje) 1915లో స్థాపించబడిన హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ అయిన అఖిల భారత హిందూ మహాసభ (ABHM) నాయకుడు. అతను 1931లో ఇటలీని సందర్శించాడు, ముస్సోలినీని కలుసుకున్నాడు మరియు ఒపెరా నాజియోనేల్ బలిల్లా (ONB) వంటి ఇటలీ ఫాసిస్ట్ పారామిలిటరీ సంస్థలచే బాగా ప్రభావితమయ్యాడు. . 1926లో, జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ONB ని సాంస్కృతిక యువజన సంస్థగా ప్రారంభించింది, ఇది యువతను “రేపటి ఫాసిస్టులు”గా ప్రభోదించింది.
మూంజే ONB తరహాలో హిందూ సైనిక సంస్థను నిర్మించాలనుకున్నారు. అతను తన డైరీలో ఇలా పేర్కొన్నాడు, 3
“క్రమశిక్షణ మరియు ఉన్నతాధికారుల నిర్వహణ లేనప్పటికీ, బలిల్లా మరియు ఇతర సంస్థల భావనలు నన్ను బాగా ఆకర్షించాయి. ఫాసిజం ఆలోచన ప్రజల మధ్య ఐక్యత భావనను స్పష్టంగా తెలియజేస్తుంది. హిందువుల సైనిక పునరుత్పత్తి కోసం భారతదేశానికి మరియు ముఖ్యంగా హిందూ భారతదేశానికి అలాంటి సంస్థ అవసరం.”
బి.ఎస్. మూంజే, అఖిల భారత హిందూ మహాసభ (ABHM) నాయకుడు. Tweet
మర్జియా కాసోలారి తన పుస్తకంలో, ‘ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక’లో ఇలా చెప్పింది 4
“RSS లో నియామక పద్ధతి ఆచరణాత్మకంగా ఇటలీలోని బలిల్లా యువజన సంస్థ నియామక పద్ధతి లాగా ఉంటుంది. ఉదాహరణకు, షాకా సభ్యులు వారి వయస్సు ప్రకారం (6–7 నుండి 10; 10 నుండి 14; 14 నుండి 28; 28 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) వర్గీకరించబడ్డారు.”
మర్జియా కాసోలారి తన పుస్తకంలో, 'ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక' లో Tweet
హెడ్గేవార్ (Hedgewar ) 1925లో RSS ని స్థాపించారు. అతను తన రాజకీయ గురువు మూంజే మరియు 1927 లో మూంజే నుండి ABHM అఖిల భారత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్ స్వర్కర్ (Damodar Svarkar) యొక్క హిందుత్వ భావజాలంతో బాగా ప్రభావితమయ్యాడు. ABHM కార్యకర్త నాథూరామ్ గాడ్సే 948లో M.K గాంధీని హత్య చేసే వరకు, ABHM మరియు RSS మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
యూదులకు వ్యతిరేకంగా నాజీయిజం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా హిందుత్వం

చిత్రం: ఏప్రిల్ 1945 లో నాజీ నిర్బంధ శిబిరం బెర్గెన్-బెల్సెన్ విముక్తి తర్వాత యూదుల సామూహిక సమాధి
నాజీ జాతీయవాదుల వలె, హిందుత్వ సిద్ధాంతకర్తలు మరియు ప్రస్తుత హిందూత్వ నాయకులు కూడా ఆర్య జాతి యొక్క ఆధిపత్యాన్ని విశ్వసించారు. తన పుస్తకం ‘ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక’లో, చరిత్ర ప్రొఫెసర్ మార్జియా కాసోలారి ఇలా అన్నారు, 5
"ఆర్య జాతిని నాజీలు కీర్తించడాన్ని మిలిటెంట్ హిందుత్వ వాదులు తమ ఆర్య జాతి మరియు కుల సిద్ధాంతానికి నిరూపణగా తప్పుగా అర్థం చేసుకున్నారు. స్వస్తిక యొక్క పాత హిందూ చిహ్నాన్ని నాజీలు ఉపయోగించడం హిట్లర్ యొక్క ఆలోచనలు హిందూ మతానికి దగ్గరిగా ఉన్నట్టు భావించారు.”
తన పుస్తకం 'ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక'లో, చరిత్ర ప్రొఫెసర్ మార్జియా కాసోలారి Tweet
నాజీ జాతీయవాదులు యూదులను తక్కువ జాతిగా పరిగణించారు మరియు వారిని నిర్మూలించాల్సిన సూక్ష్మక్రిములతో పోల్చారు. హిందూత్వ జాతీయవాదులు ముస్లింలను ఆక్రమణదారులు గా, దేశద్రోహులు గా ప్రచారం చేస్తారు. వారు ద్వేషపూరిత ప్రచారాన్ని నడుపుతున్నారు మరియు ముస్లింలపై హింసకు పాల్పడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం హిందుత్వ సిద్ధాంతకర్తలు బోధించిన దాని ద్వారా ప్రస్తుత జాతీయవాదుల ఈ రకమైన ప్రవర్తన ను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.
గోవాల్కర్ ఇలా అన్నాడు, 6
"ఒక మాటలో చెప్పాలంటే, వారు [ముస్లింలు] విదేశీయులుగా ఉండటం మానేయాలి లేదా ఏమి పొందకుండా, ఎటువంటి అధికారాలకు అర్హులు కాకుండా, ఎలాంటి ప్రాధాన్యత లేకుండా, పౌర హక్కులు లేకుండా హిందూ దేశానికి పూర్తిగా లోబడి దేశంలో ఉండిపోవచ్చు”
RSS రెండవ సర్సంఘచాలక్ (చీఫ్) M.S. గోల్వాల్కర్ Tweet
భారత స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది ముస్లింలు మరణించారు. విడ్డూరం ఏమిటంటే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో RSS ఎప్పుడూ పాల్గొనలేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో స్వాతంత్య్ర సమరయోధులను అరెస్టు చేసినప్పుడు, హిందూ మహాసభ బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించింది మరియు బెంగాల్, సింధ్ మరియు వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (NWFP) లలో ముస్లిం లీగ్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ముస్సోలినీ ఫాసిజం మరియు హిట్లర్ నాజీయిజం వల్ల మారణహోమంలో (holocaust) లో లక్షలాది మంది యూదులు, ముస్లింలు మరియు ఇతరులు చంపబడ్డారు, రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణాలకు గురి అయ్యారు, మరియు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. అలాంటి ముస్సోలిని నీ మరియు హిట్లర్ ని హిందుత్వ వాదులు ప్రశంసించారు.
RSS రెండవ సర్సంఘచాలక్ (చీఫ్) M.S. గోల్వాల్కర్, 1938లో హిట్లర్ యొక్క హింస మరియు యూదుల మారణహోమాన్ని ప్రశంసించారు మరియు ఇలా అన్నారు.
"జాతి (ఆర్య) మరియు దాని సంస్కృతి యొక్క స్వచ్ఛతను కొనసాగించండి"
RSS రెండవ సర్సంఘచాలక్ (చీఫ్) M.S. గోల్వాల్కర్ Tweet
“జర్మనీకి నాజీయిజాన్ని, ఇటలీకి ఫాసిజాన్ని ఆశ్రయించే హక్కు ఉంది” అన్నారు.”
దామోదర్ సావర్కర్కీ, లక హిందుత్వ సిద్ధాంతకర్త Tweet
నాజీ యుజెనిక్స్ (eugenics) మరియు RSS యొక్క 'ఉత్తమ సంతతి' ప్రాజెక్టులు
జీవసంబంధమైన (biological) ఆర్య జాతి లేదా జాతి సోపానక్రమం (hierarchy) వంటి భావనలు అశాస్త్రీయమైనవి. కానీ హిందూ జాతీయవాదులు ఇప్పటికీ అలాంటి నకిలీ శాస్త్రాన్ని నమ్ముతున్నారు. RSS ఆరోగ్య విభాగమైన ఆరోగ్య భారతి ‘గర్భ్ విజ్ఞాన్ సంస్కార్’ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించింది, ఇది ‘ఉత్తమ సంతతి’ లేదా ఎక్కువ తెలివితేటల గల, తెల్లటి మరియు పొడవాటి మానవులను పుట్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. బహుశా 2005 లో ఈ ప్రాజెక్ట్ మొదట గుజరాత్లో ప్రారంభించబడింది మరియు 2015 నాటికి జాతీయ స్థాయికి విస్తరించబడింది. ఆరోగ్య భారతి జాతీయ కన్వీనర్ డాక్టర్ హితేష్ జానీ ఇలా అన్నారు, “తక్కువ ఎత్తు ఉన్న ముదురు (నలుపు) రంగు చర్మం గల తల్లిదండ్రులు ఈ ప్రాజెక్ట్తో తెల్లటి మరియు పొడవుగా ఉండే బిడ్డలను పొందవచ్చు.”
ఇది ఖచ్చితంగా జాతి వివక్ష.
ఉత్తమ సంతతి ప్రాజెక్ట్ నాజీల యుజెనిక్స్ (eugenics) ప్రాజెక్ట్ లెబెన్స్బ్రాన్ (Lebensbron) ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ ‘జాతి పరిశుభ్రత’ అనే నకిలీ శాస్త్రీయ భావన ఆధారంగా రూపొందించబడింది మరియు ఇది ‘ఆర్యుల’ పిల్లల జనన రేటును పెంచుతుందని నాజీలు విశ్వసించారు. ఈ భావన ప్రకారం జాతిపరంగా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వారు అని వర్గీకరించబడిన వ్యక్తుల మధ్య వివాహేతర సంబంధాలను కలిగించడం మరియు జాతిపరంగా స్వచ్ఛమైన పిల్లలకు (నమ్మకం మాత్రమే) జన్మనివ్వడం చేసేవారు.
మీరు సరిగానే చదివారు! మూర్ఖులను తక్కువ అంచనా వేయవద్దు.
పురావస్తు ప్రాజెక్టులు మరియు కాషాయ పురావస్తు శాస్త్రవేత్తల తో హిందూత్వ ప్రచారం
నేను ఇంతకుముందు చెప్పినట్టు, జాతీయ అహంకారం మరియు పక్షపాతం కలిగిన పురావస్తు శాస్త్రం, మానవ శాస్త్రం (anthropology) మరియు జాతి శాస్త్రం (ethnology) వంటి విభిన్న రంగాలకు చెందిన విద్యావేత్తలు మరియు పండితులు ఫాసిజం మరియు నాజీయిజాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 7
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) లోని ‘భగ్వా’ (కాషాయ) పురావస్తు శాస్త్రవేత్తలు హిందుత్వ నిర్మాణంలో ఇదే పాత్రను పోషించారు. హిందూత్వ సిద్ధాంతకర్తలు యూరోపియన్ ఫాసిస్ట్ మరియు జాతీయవాద ఉద్యమాల నుండి పురావస్తు ప్రదేశాల చుట్టూ ఉన్న రాజకీయాలను కాపీ చేసారు, ఇందులో తరచుగా ఫోర్జరీలు, వక్రీకరణ, తప్పుడు సమాచారం, ద్వేషం మరియు హింస ఉన్నాయి.
హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి హిందూత్వ జాతీయవాదులు రెండు రకాల పురావస్తు ప్రాజెక్టులను చేపట్టారు:
1. రామాయణం (అయోధ్య) మరియు మహాభారతం (హస్తినాపురం, మధుర & కురుక్షేత్రం) వంటి హిందూ ఇతిహాసాలు మరియు సాహిత్యంలో (చారిత్రక స్థానాలకు బదులుగా) పేర్కొన్న ప్రదేశాలతో భారతదేశ చరిత్రను గుర్తించడం. ఇలా హిందుత్వ వాదులు చేస్తున్నది ఇటలీ ఫాసిస్టులు ఇటలీని రోమన్ సామ్రాజ్యంతో మరియు నాజీలు జర్మనీని చరిత్రపూర్వ జర్మేనియాతో గుర్తించడంతో పోల్చవచ్చు. ఇవన్నీ చారిత్రకంగా సరైనవి కావు.
2. సింధు లోయ లేదా హరప్పా నాగరికతని ఆర్యణీకరించడం. ఇందులో ‘నకిలీ గుర్రపు ముద్ర’ ప్రాజెక్ట్, సింధు-సరస్వతి ప్రాజెక్ట్ మరియు DNA అధ్యయనాల యొక్క మోసపూరిత నివేదికలు మరియు ఇతర కొనసాగుతున్న పురావస్తు ప్రాజెక్టులు ఉన్నాయి. నేను ఇప్పటికే మరొక బ్లాగ్ పోస్ట్లో దీని గురించి చర్చించాను. ఆర్యులు భారతదేశానికి ఎన్నడూ వలస రాలేదని, హరప్పా నాగరికతను ఆర్యులే అభివృద్ధి చేశారని భారతీయులను నమ్మించి మోసం చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
ASI యొక్క మాజీ డైరెక్టర్ జనరల్ (1968 నుండి 1972 వరకు) బ్రజ్ బాసి లాల్ను ‘భగ్వా’ (కాషాయ) పురావస్తు శాస్త్రవేత్త అని పిలుస్తారు. అతను 1950 మరియు 1952 మధ్య పురావస్తు మహాభారత ప్రదేశాలలో, 1960 మరియు 69 మధ్య కాళీబంగన్ వంటి హరప్పా సంస్కృతితో సంబంధం ఉన్న ప్రదేశాలు మరియు 1975 మరియు 1980 మధ్య అయోధ్య వంటి రామాయణ ప్రదేశాలలో పనిచేశాడు.

చిత్రం: బీజేపీ మంత్రి డాక్టర్. మహేష్ శర్మ తోపాటు 2017లో పుస్తకాన్ని విడుదల చేస్తున్న మాజీ DG, ASI, ప్రొఫెసర్ B.B. లాల్ (కుడివైపు చివర)
అతని తప్పుడు వాదనలు:
1. హస్తినాపురం మరియు మధుర వంటి ప్రదేశాలలో కనుగొనబడిన ప్రీ-బుద్ధిస్ట్ పెయింటెడ్ గ్రే వేర్ (Painted Grey Ware ) ని మహాభారతంలో పేర్కొన్న ప్రదేశాలకు లింక్ చేయడం.
2. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన బాబ్రీ మసీదు క్రింద మందిర స్తంభాల ఉనికి.
3. ప్రస్తుతం ఉన్న ఘగ్గర్-హక్రా నదిని వేద సరస్వతి నదిగా సూచించడం
ఇతర హిందూత్వ అనుకూల పురావస్తు శాస్త్రవేత్తలు B.R మణి మరియు R.S. బిష్త్ యొక్క విద్యార్థులు ఇప్పుడు ASI తవ్వకాలను నియంత్రిస్తున్నారు.
పురావస్తు శాస్త్రవేత్తలు సుప్రియా వర్మ, జయ మీనన్లు ఇలా అన్నారు: 8
“ASI లోని సీనియర్ పురావస్తు శాస్త్రజ్ఞులందరికీ మితవాద (right-wing politics) సానుభూతి ఉంది. వారు RSS ప్రచారక్లు కాకపోవచ్చు, కానీ బహిరంగంగా బిజెపితో ఉన్నారు. కాషాయ పురావస్తు శాస్త్రవేత్తలు గా పేరొందిన S.P. గుప్తా మరియు B.B. లాల్ తో ఆర్.ఎస్. బిష్త్ ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండేవారు.”
పురావస్తు శాస్త్రవేత్తలు సుప్రియా వర్మ, జయ మీనన్ Tweet
హిందూ ఓటర్లను ఏకీకృతం చేయడానికి హిందూత్వ జాతీయవాదులు పురావస్తు ప్రదేశాల చుట్టూ రాజకీయాలను మరియు ముస్లిం కట్టడాలను కూల్చివేయడం చేస్తూనే ఉంటారు.
Footnotes
- Page no. 121, In the Shadow of the Swastika, Marzia Casolari, associate professor of Asian History at the University of Turin, Italy https://iris.unito.it/retrieve/handle/2318/1749839/641763/9780367508265_Casolari.1stP.pdf
- page 169, Nationalism and Archaeology in Europe by Margarita Díaz-Andreu, Timothy Champion
https://www.taylorfrancis.com/books/mono/10.4324/9781315748221/nationalism-archaeology-europe-margarita-di%CC%81az-andreu-timothy-champion - Page no. 42, In the Shadow of the Swastika, Marzia Casolari, associate professor of Asian History at the University of Turin, Italy https://iris.unito.it/retrieve/handle/2318/1749839/641763/9780367508265_Casolari.1stP.pdf
- Page no. 34, In the Shadow of the Swastika, Marzia Casolari, associate professor of Asian History at the University of Turin, Italy https://iris.unito.it/retrieve/handle/2318/1749839/641763/9780367508265_Casolari.1stP.pdf
- Page no. 76, In the Shadow of the Swastika, Marzia Casolari, associate professor of Asian History at the University of Turin, Italy https://iris.unito.it/retrieve/handle/2318/1749839/641763/9780367508265_Casolari.1stP.pdf
- Page no. 91, In the Shadow of the Swastika, Marzia Casolari, associate professor of Asian History at the University of Turin, Italy https://iris.unito.it/retrieve/handle/2318/1749839/641763/9780367508265_Casolari.1stP.pdf
- page 169, Nationalism and Archaeology in Europe by Margarita Díaz-Andreu, Timothy Champion https://www.taylorfrancis.com/books/mono/10.4324/9781315748221/nationalism-archaeology-europe-margarita-di%CC%81az-andreu-timothy-champion
- Was There a Temple under the Babri Masjid? Reading the Archaeological 'Evidence' by Supriya Varma and Jaya Menon: https://www.jstor.org/stable/25764216